Tuesday, June 12, 2018

మతం వేరు - మతోన్మాదం వేరు


మతోన్మాద సంస్థలు మతాన్ని స్వంతం చేసుకుని మాట్లాడుతుంటాయి. ఆశ్చర్యమేమిటంటే ఒక్కోసారి లౌకికవాదులని చెప్పుకునేవారు సైతం మతోన్మాదులని విమర్శంచే పనిలో మొత్తంగా మతాల్ని విమర్శించేస్తుంటారు.
హిందూ మతమో,ఇస్లామో , క్రైస్తవమో, బౌద్దమో... ఏదైన కానీ .. ప్రపంచంలో ఏదైన ఒక మతాన్ని అనుసరిస్తూ ఆస్తికులుగా ఉన్న జనాభానే అత్యధికం. మరి మతానికీ, మతోన్మాదానికీ తేడా లేక పోతే ప్రపంచంలోని ఆస్తిక జనాభా అంతా మతోన్మాదులే కావాలి.
ఈ ధోరణి తప్పు అని చెప్పడానికి పెద్ద చర్చ అవసరంలేదు. మతాన్ని అనుసరించే ప్రజలంతా మతోన్మాదులు కారు.
మతాన్ని, మతోన్మాదాన్ని వేరు చేసి మాట్లాడాలి. మతోన్మాదుల్ని ఒంటరిని చేయాలి. మతోన్మాదుల స్వరాలు మతాలకు డబ్బింగ్ చెప్పనీయరాదు. మతవేదికల నుంచి మతోన్మాదాన్ని తరిమివేయాలి.
గుజరాత్ లో హిందూ మతోన్మాదులు ముస్లిం జనాలపై చేసిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు... స్త్రీల పై మృగాల్లా గ్యాంగ్ రేపులకి పాల్పడ్డారు... మూడన్నర సంవత్సరాల బాలికలను సైతం వదలలేదు.. తర్వాత వారిని ముక్కలుగా నరికి కిరోసిన్ పోసి సజీవ దహనం చేశారు. నోటి నిండా కిరోసిన్ తాగించి ... నోట్లో అగ్గిపుల్ల వేసి మనుషుల్ని పెట్రోలుబాంబులుగా పేల్చేసిన సంఘటనలు... వికలాంగుల్ని సైతం మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి కాల్చేసిన విద్వేషం... గర్భాన్ని చీల్చి పిండాల్ని మంటల్లో వేసిన దారణాలు.... శిశువుల్ని సైతం కాల్చేసిన క్రూరత్వాలు... ఈ కసాయి పనులు చేస్తూ ఆ మృగాలు ఏమని నినాదాలిచ్చాయో తెలుసా... 'జై శ్రీరామ్'. జై శ్రీరామ్'
దెయ్యాలు వేదాలు వల్లించటమంటే ఇదే! రామాయణంలో రాముడు తన భార్యని ఎత్తుకెళ్లిన రావణుడితో యుద్దం చేశాడు. రాముడు రేపిస్టులకీ, హంతకులకీ, దేముడెలా అవుతాడు? అలా అనడానికి ఎవరికైన ఎంత ధైర్యం?
సీతను ఎత్తుకెళ్లిన రావణుడు సైతం ఆమెను బందీగా చేసినా గౌరవంగా చూశాడేకానీ ఈ తరహా ఆకృత్యాలకు పాల్పపడలేదు కదా.... ఈ పిశాచులు పవిత్ర రామనామం సంగతి అటుంచి, రావణుడి పేరు ఎత్తేందుకు కూడా అర్హత లేని హీనులు.
బజరంగ్ దళ్ అంటే హనుమంతుడి సైన్యం అని అర్థం. హనుమంతుడు, వానరసైన్యం సీతను ఎత్తకెళ్లిన రావణుడితో యుద్దం చేశారు. హన్మంతుడు ఆజన్మ బ్రహ్మ చారి, పరమ భక్తుడూ, సీతని విడిపించే ధర్మకార్యానికి సాహసంతో ముందుకి దూకిన వాడూ, రామ నామం పట్ల నిరుపమాన భక్తి కలవాడు.
హనుమంతుడి పేరు చెబితేనే పిశాచాలు పారిపోతాయంటారు. హత్యలు రేపులు, రేపులు చేసే పిశాచాలు - పరమ భాగవతోత్తముడు ఆంజనేయుడి పేరు ఎలా పెట్టుకుంటారు? హంతకుల, రేపిస్టుల, లూటీకారుల, నేరస్తుల సైన్యం - పిశాచ దళ్ అని పేరు పెట్టుకోవాలి కానీ బజరంగ్ దళ్ అని పేరు ఎలా పెట్టుకుంటారు?
గుజరాత్ హంతకమూకల చర్యలను ఏ మత గ్రంథం సమర్థిస్తుంది,
వివేకానందుడూ, ఠాగూర్, గాంధీ, నారాయణగురు, వంటి మహానీయులనీ, అందించిన ధర్మానికి అంతర్జాతీయంగా మచ్చ తెస్తున్న హంతకుల లూటీదారులు మూక - హిందూ మతానికి ప్రతినిధులు ఎలా అవుతారు?
ఇస్లాం అంటే శాంతి అని అర్ధం. భగవంతుని పట్ల నిష్ఠ, విశ్వాసం ఇస్లాంకి ప్రాణశక్తి.
హిందూ ముస్లింల మైత్రికి పునాది వేసిన ఆదర్శ పాలకుడు అక్బర్, కారణజన్ముడు కబీర్, స్వాతంత్రోద్యమ సింహం 'అష్ఫా ఖుల్లా' హిందూ ముస్లిం మైత్రిని కోరిన అబ్దుల్ కలామ్ ఆజాద్, 'ఖుదాయే ఖిద్మత్ గార్' వంటి త్యాగపూరిత సంస్థని సృష్టించిన మహాత్ముడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్' దేశ రక్షణని తపస్సుగా స్వీకరించిన ఋషితుల్యుడు అబ్దుల్ కలామ్' లోకోత్తర కళాకారుడు బిస్మిల్లాఖాన్' యుద్ధరంగంలో విజృంభించి మూడు పాకిస్థాన్ ట్యాంకుల్ని పేల్చి, ఆత్మాహుతి దాడితో నాలుగవ ట్యాంకుల్ని పేల్చి చివరికి అమరుడైన పరమవీర చక్ర అబ్దుల్ హమీద్, భారత్ స్వర్ణోత్సవాల సందర్భంగా ఉప ఖండం ప్రజలను వందేమాతరం స్ఫూర్తిలో ఓలలాడించిన ఎ. ఆర్. రహమాన్ ...ఒక్కరా ఇద్దరా ... భారతీయా ఇస్లాం ఎన్ని అమూల్య రత్నాలను అందించిందని .. భారతీయ ఇస్లాం స్ఫూర్తికి ప్రతినిధులు అయ్యేది వీరు.
జమ్మూలో బస్ లో చొరబడి, కాశ్మిర్ లో గ్రామాల్లో చొరబడి ... హిందువులని సిక్కులని వేరు చేసి పిల్లాపాపలతో సహా - నిలబెట్టి కాల్చి చంపే రాక్షసులు , గోధ్రాలో రైలు బోగీకి నిప్పు పెట్టి, చివరికి తప్పించుకుని కిందకి దూకే ప్రాణాలని కూడా నరికి మంటల్లో వేసే పాపాత్ములు... మాతృదేశానికి ద్రోహం చేసి పొరుగు దేశపు కనుసైగతో ఇక్కడ విధ్వంసానికి తెగబడే ఉన్మాదులు... భారతీయ ఇస్లాం కి ప్రతినిధులు ఎలా అవుతారు? అసలు ఆ పాపాత్ములు ముస్లింలు ఎలా అవుతారు.? ఖురాన్ కానీ, మారే పవిత్ర గ్రంథమైన వారి దౌష్ట్యాలను ఎలా సమర్థిస్తుంది? వారు తమపాపాలకు సాకుగా ఇస్లాంను, ఖురాన్ ను ఎలా చూపగలరు?
హిందువులైన, ముస్లింలైనా... మతోన్మాదులను మతాలనుంచి వేరు చేయాల్సిన అవసరం ఉంది.
నిజమైన హిందువులు, ముస్లిం లు.. ఆస్తికులు - ఈ ఉన్మాదుల చర్యలను ఖండించాలి. వారు మతం పేరుని ఉపయోగించుకోలేని పరిస్థితిని తీసుకురావాలి
ఆర్.ఎస్.ఎస్ హిందువులకి, హిందుస్తానికి, వ్యతిరేకి, శత్రువూ...
ఆర్.ఎస్.ఎస్ వేషం... ఖాకీ నిక్కరూ, నల్ల టోపీ.. భారతీయ ఆహార్యం కాదు , (మహా అయితే ఈ ఖాకీ నిక్కర్లకి 1925 నాటి బ్రిటిష్ పోలీసుల ఆహార్యం స్ఫూర్తి అయి ఉండవచ్చు)
మన దేశం పరాయి పాలనలో ఉన్నప్పుడు ,దేశప్రజలంత ఇక్కట్ల పాలవుతూ భారతమాత శృంఖలాలు తెంచేందుకు హిందువులూ ముస్లింలూ సమైక్యంగా స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న కాలంలో ఆర్.ఎస్.ఎస్ ఆ మహత్యర పోరాటానికి దూరంగా ఉంది. ఆర్.ఎస్.ఎస్. భావజాలంతో స్ఫూర్తి పొందిన వ్యక్తే జాతిపీత గాంధీజీని చంపేశాడు. నాడు ఆర్.ఎస్.ఎస్ దేశ ప్రజల ఆగ్రహాన్ని, అసహ్యాన్ని చవిచూసింది.
మాట్లాడితే జాతీయత గురుంచి వల్లెవేసే ఆర్.ఎస్.ఎస్ నిజానికి జాతిని ముక్కలు చేయడమే అజెండాగా పెట్టుకుంది. ఆర్.ఎస్.ఎస్ కి ఎంతగా దేశభక్తి లేదంటే .... చివరికి మొన్నమొన్నటి వరకూ అది మన జాతీయ పతాకానికి సైతం వ్యతిరేకం . ఆ మధ్య కర్ణాటక లోని ఒక ఈద్గా మైదానం లో మన జాతీయ జెండా ఎగరవేయట్లేదని సంఘ్ పరివార్ శక్తులు గొడవలకి దిగారు. నిజానికి వారికి గొడవలపైనే ఎక్కువ ఆసక్తి, జాతీయ జెండాపై కాదు.
ఎందుకంటే దశాబ్దాలుగా ఆర్.ఎస్.ఎస్ నాగపూర్లోని తన కార్యాలయం పైన ఏనాడూ జాతీయ జెండా ఎగరవేయలేదు. కేవలం పోయినేడు ఆగష్టు 15న ఏ కారణం చేతో వారు తమ పద్ధతి మార్చుకున్నారు .
సంఘ్ పరివార్ బహురూపి. స్వతంత్ర భారత్ చరిత్ర లోనే దేశ విభజన తరువాత అత్యంత దారుణ మైన విషాదం బాబ్రీమసీదు కూల్చివేత. ఈ నేరానికి బాధ్యత సంఘ్ పరివార్ దే. బాబర్ అయోధ్యలో దైవ మందిరాన్ని కూలగొట్టాడో లేదో మనకి తెలీదు. దానికి సరైన ఆధారము లేదు. అయితే మధ్య యుగాల సంగతి విడిచిపెడితే ...ఆధునిక కాలంలో అయోధ్య లో ఒక దైవ మందిరాన్ని కూల్చింది సంఘ్ పరివార్ .అందుచేత నిజమైన అర్ధం లో 'బాబరుకి ఔలాద్' ఆర్.ఎస్.ఎస్ అవుతుంది , భారతీయ ముస్లింలు కారు . మధ్య యుగాల్లో భారత దేశ శత్రువులు నాదిర్షా,గజినీ , ఘోరీలు చేసిన దారుణాలను ఇవ్వాళ సంఘ్ పరివార్ నిస్సిగ్గుగా చేస్తోంది. గుజరాతీలో వందల మసీదులను పరివార్ గుండాలు ధ్వంసం చేసారు .తాము గజినీ వారసులమని గజినీ తమకు ఆదర్శమని పరివార్ శక్తులు ఇప్పుడు ప్రతక్షయంగానే అంగీకరిస్త్తున్నారు. వి .హెచ్ . పి కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా ఇటీవల ' మనం హిందూ గజినీలు అవుదాం' అని గర్వాంగానే చెప్పుకున్నారు
(నిషిద్ధ సంస్థ సిమి ఇండియాకి మరో గజినీ కావాలని ఉత్తర భారత దేశం లో పోస్టర్లు వేసింది . ఆ సంస్థ అధ్యక్షుడు డా: బదర్ గజనీ పట్ల తన ఆరాధనని దాచుకోరు. హిందూ ముస్లిం మతోన్మాదులు ఇద్దరికీ గజనీ ఆర్యాదుడు. అందుచేత వీరిద్దరినీ 'గజనిస్టు'లనో ' ఘోరీయిస్టుల' నో పిలవడం సమంజసం.)
ఆర్.ఎస్.ఎస్. కార్యక్రమాన్ని "హిందుత్వ' అనడం, దాని దుర్మార్గాల్ని కాషాయీకరణ అనిపిలవడం - చాల పొరపాటు, హిందుత్వం- అంటే హిందూ మతం యొక్క సారాంశం అని అర్ధం. ఇస్లాం తత్వానికి 'సిమి' ప్రతినిధి' కానట్టే, హిందుత్వానికి ఆర్.ఎస్.ఎస్ ప్రతినిథి కాదు. ఒకవేళ ఆర్.ఎస్.ఎస్ చెప్పుకున్న దాని వ్యతిరేకులు సైతం ఆర్.ఎస్.ఎస్ కార్యక్రమాన్ని 'హిందుత్వం' గా పిలవటం పొరపాటు. 'కాషాయం' దేశంలోని కోట్లాది ప్రజలకు పవిత్రమైన వర్ణమని' కాషాయీకరణ అనే మాటను వ్యతిరేక అర్ధంలో వాడటం వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నాడని - ఇటీవల కేరళ ముఖ్యమంత్రి ఎ.కె ఆంటోని సరిగానే చెప్పారు.
ఆర్.ఎస్.ఎస్. హిందూ మతానికి తాను ప్రతినిధినని ఏ రకంగా చెప్పుకుంటుంది? ఆ మాటకి వస్తే మొత్తం 'హిందూమతం' అని చెప్పబడేదానికి ఎటువంటి ఏకైక 'ఆధ్యాత్మిక కేంద్రం కానీ, మతాధిపతి కానీ గతంలో లేరు. ఇప్పుడు లేరు. ఆర్.ఎస్.ఎస్ కు హిందూమతపరంగా ఎటువంటి అధికారం లేదు. దేశ ప్రజల భావోద్వేగాలను ప్రతిబింబించే స్వతంత్ర పోరాటంలో ఆర్.ఎస్.ఎస్ భాగస్వామి కాదు.
కాశ్మిర్ భారత్ లో అంతర్భాగమని అక్కడ ఉగ్రవాదులను పంపి కల్లోలాన్ని రెచ్చగొట్టడం మానుకోమ్మని - మన దేశంలోని అనేక ముస్లిం సంస్థలు, ప్రముఖులు పాకిస్థాన్ కి ఎన్నోసార్లు మొహం పగిలేలా చెప్పిన విషయం ఎందరికి తెలుసు?
ఇటీవల అమెరికాలోని మసాచు సెట్స్ సాంకేతిక సంస్థ వద్ద వున్నా దక్షిణాసియా సంఘం గుజరాత్ కల్లోల్లాన్ని చర్చించేందుకు ఒక సదస్సు ఏర్పాటు చేసింది.
ఆ సదస్సులో వి.హెచ్.పి. ప్రతినిధి చేసిన ప్రసంగం ఆవేశాలనే రెచ్చగొట్టింది. అయితే రామకృష్ణ మఠం ప్రతినిధిగా పాల్గొన్న స్వామి త్యాగానంద ప్రసంగం సర్వులను అలరించింది. ఆ ప్రసంగంలో ఆయన ఇలా అన్నారు:
"ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది గాయాలపాలయ్యారో, ఎవరెవరు నిర్వాసితులు అయ్యారో, ఎందరి వాణిజ్య సముదాయాలు నాశనమయ్యాయో పత్రికల మూలంగా ఆయా అంకెలు వివరాలు మాత్రం మన వద్ద ఉన్నాయి. వేలాది కుటుంబాలు, మృతి చెందిన ప్రతి ఒక్కరూ, వారు తల్లి గానో, తండ్రిగానో, బిడ్డగానో, భర్తగానో లేక మరొకరిగానో ఉండవచ్చు, అయితే వారెంతటి విషాదం అనుభవిస్తున్నారో, అసలు వాస్తవ పరిస్థితి ఏమిటో మన ఎరుకలోని రాని విషయాలు. కుల ఘర్షణలలో మన ఆత్మీయులనో, ప్రియమైన వారినో కోల్పోయామన్న భావన మనకు కలిగితే ఈ విషాద నేపథ్యంలో చెలరేగిన భావావేశాలూ, అశాంతీ, భయానక పరిస్థితులనూ, మనం క్షుణంగా అర్ధం చేసుకోగలము.
సాటి మానవులపై జరిగిన ఈ దారుణాన్ని భావసారూప్యం కలిగిన వారంతా త్రీవ్రంగా ఖండించడం సమంజసమే..."
"...ప్రతి మతంలోనూ ప్రేమా, పరస్పర అవగాహన, శాంతిని గురించి మనం భోధిస్తున్నాము. అయితే మతం రంగుపులుముకుని కొన్ని వర్గాలు ఎందుకు ఘర్షణ పడుతున్నాయి అర్ధం చేసుకోలేక పోతున్నాం.."
"...మతం అంటే ఏమిటి మతతత్వం అంటే ఏమిటి హింసకు తావులేకుండా మతం పట్ల విశ్వాశంగా ఉండలేమా అని ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు ఎలాంటి ఉపద్రువాలనుంచైనా ప్రశాంతంగా, సునాసాయంగా బయట పడగలం..."
'...మన దైనందిన జీవనంలో వాక్సమేతంగా, భౌతికపరంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా ఉంటేనే మన ఖండన పూరిత సందేశాలకు అర్ధం ఉంటుంది. మన వివాదాలకు, అనంగీకారాలను పరిష్కరించుకోటానికి మార్గాలను అన్వేషించగల సత్తా మనకుంది. ఇలాంటి పరిస్థితులలో పరస్పర అవగాహన, గౌరవపూర్వక వాతావరణంలో చర్చలు జరపటమే ఉత్తమమైన పరిష్కార మార్గం. నిర్మాణాత్మకంగా, శాంతి పూర్వకంగా చక్కటి పరిష్కార మార్గాన్ని అన్వేషించటానికి ప్రయత్నిద్దాం. మనకు అంగీకారం కాకపోయినా ఇతరులు ఏమి చెబుతున్నారో వినేందుకు ప్రయత్నించడమే కార్య సంకల్పానికి శుభారంభం అవుతుంది. మన ఎదుటి వారి మాటలను మనం పట్టించుకోనప్పుడు, మన మాటలను వారు ఖాతరు చేయాలని, మనల్ని అర్ధం చేసుకోవాలని ఎలా ఆశించగలం?"
మతానికీ మానవత్వానికి నిర్వచనం ఇదీ!
కాదని ఎవరనగలరు - ఒక్క మతోన్మాదులు తప్ప.
'జైభారత్ సంస్థ మన మహత్తర దేశంలో, మతాలనుంచి, మొత్తంగా ప్రజా జీవనం నుంచీ మతోన్మాదాన్ని వేరు చేసి, ఓడించే దిశగా పనిచేస్తుంది'
( విజయవిహారం జూన్ 2002)
వివరాలకు:
జైభారత్ కేంద్ర కార్యాలయం,
9849995538.

Thursday, February 11, 2016

ప్రవచనం (ఖలీల్ జీబ్రాన్ రచన)


=====================================
ఆ తరువాత నాగలితో నేలను దున్ని
పంటలు పండించే రైతు అడిగాడు -
"పని అంటే ఏమిటో మాకు చెప్పండి " అని.
ఆల్ ముస్తఫ్ఫా బదులుగా ఇలా చెప్పాడు.
నీవు పనిచెయ్యి - ఎలాగంటే
భూమి మీద నడుస్తూ
భూమాత మనసుని అర్ధం చేసుకుంటూ
మును ముందుకు సాగు.
సోమరి పోతుగా మారిపోయవో
ఆగమించె ఋతువుల మధ్య
ఆగంతుకునిగా మిగిలిపోతావు!
అనంతమైన దిశగా
అపారంగా రాజస గర్వంగా
సాగిపోతున్న జీవన యాత్ర నుండి
నీవు విడివడి పోబాకు!
పని చేసేటప్పుడు నీవే ఒక వేణువు.
ఆ వేణువులో నీ హృదయం లీనమవుతుంది.
గడిచే గంట కాలం
ముగ్ధమనోహర గానమై వెలువడుతుంది.
అందరు బృందగానం చేస్తుంటే
మీలో ఏ ఒక్కరైన సరే
మూగగా, నిశ్శబ్దంగా, రెల్లుగా ఉండలేరు.
మీరు అస్తమానం అంటుంటారు-
పని ఒక శాపం అని ,
కాయకష్టం దురదృష్టం అని,
కానీ నేనంటాను-
నీవు పని చేస్తున్నవంటే
భూమి చిరకాల స్వప్న పాత్రని
నీవంతు కొంత నింపుతున్నవనీ
ఆ స్వప్నం పుట్టినప్పుడే
నీ వంతు పని నిర్దేశిత మైందని గ్రహించు.
శ్రమిస్తూ జీవిస్తూ ఉన్నప్పుడే నీవు
జీవితాన్ని నిజంగా ప్రేమిస్తావు.
కష్టిస్తూ జీవితాన్ని ప్రేమించినప్పుడు
జీవన రహస్యానికి చేరువ అవుతావు.
కానీ నీవు-
బాధలో ఉన్నప్పుడు-
పుట్టుక అనేది ఒక పాపం అని
ఉదర పోషణ అనేది ఒక నొసటరాత అనుకుంటావు.
కానీ నేనంటాను-
నుదిటి నుంచి చెమట కార్చినప్పుడే
నీ తల రాత కూడా మారిపోతుంది-అని.
జీవితం అంధకార బంధురం - అని కూడా
నీతో చెప్పి ఉంటారు.
అలసి పోయినప్పుడు
ప్రతిద్వనిస్తావు నీవు - అని
నేను చెబుతాను.
జీవితం చీకటిమయమే
కానీ జీవన కాంక్షతో కాంతివంతం చేసుకో.
కాంక్ష గుడ్డిదైనప్పుడు
జ్ఞానంతో ద్రుష్టినింపుకో.
జ్ఞానమంతా వృధానే కానీ
కృషితో ప్రయోజకత్వం చేసుకో.
సమస్త కృషి శూన్యమే
ప్రేమతో సమృద్ధం చేసుకో.
ప్రేమ పూర్వకంగా నీవు కృషి చేస్తే
నీతో నీవు, అందరితో నీవు,
చివరికి దైవంతో నీవు ఐక్యమయి పోతావు
ప్రేమతో పనిచేయడం అంటే ఏమిటి ?
హృదయం అనే దారం ఉండ నుండి
పోగులు తీసి నీ నేస్తాలకోసం వస్త్రంగా నేయడమే!
నీ వాళ్ళు నివసించాలనే ఆశతో
ఇల్లు ఒకటి అభిమానంగా కట్టడమే!
ప్రేమతో గింజలు నాటి, చేతికందివచ్చాక
ఆనందంగా కోసి నీ వాళ్లకు
ఆ ఫలాలను ఆహారంగా సమకూర్చోకోవడమే!
ప్రేమగా పనిచేయడమంటే -
ప్రతి చర్యను నీదైన శైలి లోకి తెచ్చుకుని
వానిలో ఆత్మనీ ఊపిరిని నింపడమే!
స్వర్గస్థులైన నీ వారంతా నిలబడి
నిన్ను ఆశీర్వదిస్తున్నారు తెలుసుకో.
తరచు మిమ్మల్ని-
"కలలో పలవరించడం" విన్నాను నేను -
చలువరాతిలో తన ఆత్మనే శిల్పంగా
సాక్షాత్కరింప చేసిన శిల్పి,
హలం పట్టి పొలం దున్నేవానికంటే
యెంతో మిన్న అని,
వర్ణ శోభిత ఇంద్రచాపాన్ని అందుకుని
మనిషి మెచ్చే వస్త్రాన్ని నేసే చేనేత కళాకారుడు-
కాళ్ళలో తొడిగే చెప్పులుకుట్టే చర్మకారుని కంటే
యెంతో మిన్న అని,
కానీ, నేను నిదురలో కాదు-
నది నెత్తి మద్యాహ వేళ
మెలుకువలో ఉండే అంటున్నాను-
గాలి తను వీచే దారిలో ఎదురయ్యే వృక్షంతో
ప్రేమ పుర్వకంగాను,
గడ్డి పరకలతో నామ మాత్రంగాను పలకరించదు.
గాలి స్వరాన్ని, ప్రేమ భరిత
సుమధుర గానంగా మలచ గలిగినవాడే చాలా గొప్పవాడు.
పని అంటే - ప్రేమకు రూపం ఇవ్వడమే
ప్రేమతో కాకుండా విసుగుతో చేయడం కంటే -
ఆ పనిని విడిచి పెట్టి,
ఏ గుడి ముంగిటనో కుర్చుని-
ముష్టి యెత్తుకో!
ఉపేక్షతో నీవు కా ల్చిన రొట్టె
పాడయి పోయిన రొట్టె కద అవుతుంది
అది మనిషి అర్దాకలినే తీరుస్తుంది.
కక్షతో నీవు ద్రాక్ష పానీయం తయారు చేస్తే
అది విషపూరిత పానీయమే కదా అవుతుంది.
గాన గందర్వునిలా నీవు పాడినా
ఆ పాటలో నీ ప్రేమ లేకపోతే
అది పగటి పూటైన
అది రాత్రి పూటైన
కర్ణ కఠోరంగానే కదా వినిపిస్తుంది.

Thursday, July 24, 2014

గుండె పగిలిన తండ్రి.

వహీద్ ...
వహీద్ ...
ఏడీ ... నా బంగారు తండ్రీ .. ??
రజియా .. రజియా ..
నా తల్లే .. ఎక్కడున్నావమ్మా?
ఇప్పుడే కదండ్రా .. నా చెంపలపై చెరో ముద్దు ఇచ్చి
మీ పెదాలకు అంటుకున్న నా బుగ్గల చెమటను
మీ యునిఫామ్ కాలర్ కి తుడుచుకుని
బస్సెక్కి గాల్లోకి నాకో నవ్వు విసిరి
నాన్న ఈవినింగ్ వరకు ఈ నవ్వును దాచుకో అని చెప్పి
వెళ్లారు .. పది నిమిషాలేగా ... అయ్యింది.

రజియా .. రజియా.. నా బంగారు తల్లే..!!
ఎక్కడున్నావ్ నాయనా..??
ఒక్కసారి "అబ్బూ నీను ఇక్కడే ఉన్నా " అని ఓ సారి పలకరా తల్లి ..
కంట్లో చాక్ ఫీసు డస్ట్ పడిందని ఒక రోజంతా ఎడ్చావు కదా తల్లి ..
ఈ ఇనప పెట్లకింద  యాడ నలిగిపోతున్నావ్ రా నాయనా ..

ఒకే ఒక్కసారి పలుకు నాయనా ..
బాబు వహీద్...
రేయ్ .. కొడకా..
చిన్న దోమ కుడితేనే నిద్రపోనోడివి ..
ఈ ఇనప రాడ్లల్లో ఎక్కడ పడున్నవురా .. అయ్యా ..

కొడుకో .. నా తండ్రి...
ఒక్కసారి "అబ్బు ఇక్కడే ఉన్న " అని ఒకసారి పలకరా..
ఎంతకి పలకని ఆ చిన్నారుల గొంతులు
...............................
ఈ తండ్రి గుండె ఇక కొట్టుకోవడం శాశ్వతంగా ఆగిపోయింది.
------------------------------------------------------------
( మెదక్ జిల్లా మాసాయి పేట రైల్వే క్రాసింగ్ దగ్గర స్కూల్ బస్సును రైలు  డి కోట్టిన ఘటనలో 20 మంది చిన్నారులలో ..వహిద్, రజియా కూడా ఉన్నారు .. ఈ వార్త విన్న ఈ చిన్నారుల తండ్రి గుండెపోటుతో మరణిచారు)
24-07-2014.


కన్నీళ్లు ఆగడం లెదు...

కన్నీళ్లు ఆగడం లెదు...

...............
బాయ్ నాన్న ..
బాయ్ మమ్మీ అని గట్టిగా  కౌగిలించుకుని
అమ్మ బుగ్గపై పెట్టిన ముద్దు తడి ఆరనే లేదు ..
నాన్న నేను ఈవెనింగ్ వచ్చేలోపు నీ సెల్లోకి కొత్త గేమ్ ని డౌన్లోడ్ చేసిపెట్టవా ..?
అని నాన్న నుండి తీసుకున్న మాట తాలుకు ఆనందం 
ఆబాబు మోములో ఇంకా దోబూచులాడుతూనే ఉంది.

మనకంటే పెద్ద వాడేగా  డ్రైవర్  అంకుల్..
మనకేం భయంలేదని భరోసాతో దోస్తు పెన్ను లాక్కుని 
తన చేతిలో రాసుకున్న బుజ్జి చెల్లాయి కొత్త పేరు
తెగిపడిన ఆ చేతిలో ఇంకా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

అమ్మ ఆప్యాయంగా కలిపి పెట్టిన పెరుగన్నం
ఆ చిన్నారి రక్తంతో కళ్ళు చెదిరిపోయే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది.
అప్పుడే హొమ్ వర్క్ కంప్లీట్ చేస్కున్న  ఒక తమ్ముడి నోడ్సులో
ఓ చిన్నారి తల రైలు లాక్కేల్లడంతో దేనికో ఒరుసుకుని తలనుండి మెదడు ఉడి పడిపోయింది.

ఈ వార్త విని పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ తల్లికి
తను అప్పుడే హడావుడిగా ఉతికి ఆరి ఆరకనే తొడిగిన సాక్సు
ఒక కాలుకి తొడిగి ఉన్నట్టు కనిపించగానే
ఆ తల్లి ఆ కాలు పట్టుకుని మిగతా భాగాల కోసం దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూనే ఉంది.

ట్రైన్ ఈడ్చుకెళ్తున్న బస్సు నుండి ఓ బాబు
అంకుల్ ప్లీజ్ ట్రైన్ ఆపవా .. నాకాలు తెగి ఎక్కడో పడిపోయింది అరుపు...
కిలోమీటరు ఆ బస్సుని ఈడ్చుకెళ్ళి గాని ఆ ట్రైన్ ఆగలేకపోయింది .

కళ్ళ నుండే ప్రాణం పోయిందా అన్నట్టు ప్రాణం పోయిన
రెప్ప మూత పడని ఆ చిన్నారి కళ్ళు  నిర్లక్ష్యం నిండిన  
ఈ సమాజాన్ని ఎప్పటికి ప్రశ్నిస్తూనే ఉంటాయి

క్షణం క్రితం బోల్డన్ని కబుర్లు చెప్పుకుని నవ్వుకున్న ఆ పసి దేహాలు 
మరు క్షణం నిర్జీవపు ముద్దలయ్యాయంటే గుండెని ఎవరో పదునైన కత్తితో కోస్తున్నట్టే ఉంది ...
కన్నీళ్లు ఇప్పట్లో ఆగేలాలేవు ...
(ఈ రోజు మెదక్ జిల్లా మాసాయిపేట లో స్కూల్ బస్సుని రైల్ డీ కొట్టి 20 మంది పిల్లలు దారుణంగా చనిపొయారు. )

Sunday, May 18, 2014

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?

ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది? 

-------------------------------------------------------------
ఎన్నికలై పోయిన తర్వాత దేశమంతా ఎలాగుంటుంది?
దగాపడిన ఒక ఆడకూతిరిలా వుంటుంది!
దొంగ నవ్వుల బ్రోకర్ని నమ్మేసి అమాయకంగా రైలేక్కిపోయిన పల్లెటూరి పిల్లలాగ ఉంటుంది దేశం.
ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత దేశం ఎలాగుంటుంది.
తీరని కోరికలతో లక్ష్య బ్యాలెట్ పత్రాల నోము నోస్తున్న బాల వితంతువులాగా వుంటుంది దేశం.
గాలికి ఉబ్బిపోయిన ఒక గుడారంలాగుంటుంది.
చిరిగిపోయిన ప్రచార పత్రాల గుట్టలాగుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం ఎలాగుంటుంది.?
ఐదేళ్ళ నిద్రకు కొంగుపరుచుకొంటున్న పిల్లల తల్లిలాగుంటుంది.
నా దేశం ఎన్నికలైపోయినాక ఏమౌతుంది?
అసత్య ప్రచారాల, జయ విజయధ్వానా ఘోష తగ్గినాక మనకి హఠాత్తుగా మన దరిద్ర సముద్ర హోరు వినిపిస్తుంది.
మనకి భోజనం లేదని గుర్తుకువస్తుంది.
మనకి ఉపాది లేదని, మనకి దిక్కు దివాణం లేదని,
మనకి తెరువూ, తీరు లేదని మళ్ళి గుర్తుకు వస్తుంది.
మనకి మళ్ళి వెనుకటి మన చక్రవర్తుల బిడ్డలా పట్టాభిషేకం గుర్తుకు వస్తుంది.
మన త్రివర్ణ పతాకం మీద పరాయి మనుషుల నీడలు పడుతున్నాయని, మనకి మళ్ళి భయం వేస్తుంది. పంచ వర్ష ప్రణాళికల ఓటి చప్పుడు వినిపిస్తుంది.
ఇరవై సూత్రాలకు ముడి లేదని, పథకాలు పారడం లేదని మనకి మళ్ళీ గుర్తుకు వచ్చి మన మీద మనకి జాలేస్తుంది.
సమస్యల పరిష్కారం కోసం కాక ఓటు నెల్లుకొవటానికి మనకి నినాదాలు వినిపించారని తెలుస్తుంది.
మనల్ని భయపెట్టి, మనల్ని భ్రమపెట్టి, మన భయాల్ని మనకి ఎరగా చూపి మనల్ని మనవాళ్ళే వేసుకున్నారని తెలిసి మనకి కొంత బాధ కలుగుతుంది.
రోగాలతో కుళ్ళి పోతున్న మన అమాయక దేశాన్ని మోసం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదు.
గోపి చిన్న వాడని పడుచుని మందలోడు మోసం చేసినంత తేలికగా
మనల్ని "మనవాళ్ళు" చేయగలరు.
సోలడు గింజలకు మందులున్నాయి
అద్దెడు గింజలకు మందులున్నాయి
పిడికెడు గింజలకు మందులున్నాయి
తల నొప్పులకు మందులున్నాయి
శిరసు బాధలకు మందులున్నాయి
సూతిక నొప్పులకు మందులున్నాయి...
అని సైకిలెక్కి అసత్య ప్రచారం చేస్తాడు.
ఉత్తరాంద్రలో జానపదంలో మందుల మోసగాడు.
దారిద్రానికి మందులున్నాయి.
నిరుద్యోగానికి మందులున్నాయి.
సమైక్యతకు మందులున్నాయి.
సౌష్టవానికి మందులున్నాయి
అంటారు ఎన్నికలలో మనవాళ్ళు
సమస్యలు మిగిలిపోతాయి
నినాదాలు మారిపోతాయి
మందలోడు మారు వేషం వేసుకుని, మరో అసత్యప్రచారం ఆరంభిస్తాడు.
గోపిచిన్న వాళ్ళ భార్యలు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మళ్ళీ వాటినే నమ్ముతారు. అందుకనే.
ఎన్నికలైపోయినాక ఒక విషాదాంతమైన ప్రహసనం ముగిసిపోయినట్టుంటుంది.
ఎన్నికలైపోయినాక దేశం పరాయి వాడి పాలనలోకి వెళ్లి పోయినట్టు అనిపిస్తుంది.
ఎన్నికలైపోయినాక మనల్ని ఎవరో వెక్కిరిస్త్తున్నట్టే అనిపిస్తుంది.
ఎవరో మనల్ని చూసి నవ్వినట్టుంటుంది.
ఎన్నికల జ్వరం తగ్గిపోయిన తర్వాత మన పూర్వస్థితి గుర్తుకొచ్చి అంతా మునుపటిలాగే చీకటిగా, ఆకలిగా, నిరాశగా, నిస్సత్తువుగా అగమ్యంగా వున్నట్టు అర్ధం అవుతుంది.
పంచుకోలేక మనం తగవులాడుకుంటున్న రొట్టెను కోతి తినేసినట్టు తెలుస్తుంది.
అందరు సమానులేనని మనకి ఎన్నికలైపోయినాక తెలుస్తుంది.
పరాయి గజనీలైన, మన సొంత నిజాములైన ఒకటే అని బోధపడుతుంది.
శ్రీకృష్ణ దేవరాయలైన, ఔరంగాజేబైనా ఒకటేనని అర్ధం అవుతుంది.
మన ఇంట పుట్టిన దోమైనా, పరాయింట పుట్టిన జలగైనా
మన రక్తం పీల్చే బతుకుతాయని స్పష్టపడుతుంది.
తెలిసి తెలిసీ అయిదేళ్ళకోసారి జీవితాంతం మోసపోవటం గురించి ఏడుపొస్తుంది.
మన మీద మనకి కొంచెం అసహ్యం వేస్తుంది.
మన మీద కొంత రోత పుడుతుంది.
మన బుద్ది గడ్డి తింటున్నాదని తెలిసీ సిగ్గేస్తుంది.
ఎన్నికల పతాకాలు విప్పేసిన తర్వాత, గుడారాలు పీకేసిన తర్వాత,
పట్టాభిషేక మహోత్సవం ముగిసిన తర్వాత
తుపాకి ఇంకా మనకే గురిపెట్టి ఉందని తెలుస్తుంది.
మన ఓటే మనల్ని కాటేసిందని తెలుస్తుంది.
ఈ మొహం మరో అయిదేళ్ళ వరకూ ఎవరికి చూపించలేం గదా అనిపిస్తుంది. దిగులేస్తుంది.
........................................................................................................

- పతంజలి, ఉదయం దినపత్రిక, 29.12.1984 (పతంజలి భాష్యం నుండి)

Saturday, April 7, 2012

శంకర పీఠాధిపతులు అంటరానివారు.


ఆది శంకరులు స్థాపించిన శంకర మఠాలు పరమ ఛాందసానికి మూల కేంద్రాలుగా ఉంటూ వస్తున్నాయి. శంకరులు ప్రచారం చేసిన అద్వైతం ఉత్కృష్టమైన ఆదర్శం. శంకర మఠాలు ఆది శంకరుల అద్వైతానికి, మరీ ముఖ్యంగా ఆయన మనీషా పంచకం స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.
  ''..ఆమధ్య ఒక బహిరంగ సభలో ఒక స్త్రీ వేద పఠనం చేస్తుంటే, అది అధర్మమని, ఆ బహిరంగ సభలోనే ప్రకటించిన ఓ శంకరస్వాముల ఉదంతం పత్రికల్లో ప్రముఖ వార్తగా చోటుచేసుకుంది..'' అని రావిపూడి వెంకటాద్రి 'అడుగు జాడలు' పుస్తకం (పే.141)లో రాశారు.
ఏకంగా... 'సతి'నే సమర్థించిన శంకరాచార్య ఉన్నారు. మరి రావిపూడి వెంకటాద్రి చెపుతున్న శంకరాచార్యులు ఎవరో మనకి తెలీదు. బహుశా చంద్ర శేఖర సరస్వతి స్వామే కావచ్చు.
తి ఆది శంకరులు దేశమంతా తిరిగి మొత్తం నాలుగు పీఠాలు స్థాపించారు. అయితే మనకి ఇప్పుడు 5 పీఠాలు ఉన్నాయి.
కంచి పీఠం ఆచార్యులు జయేంద్ర సరస్వతి ఇప్పుడు హత్యకేసు మీద జైలులో ఉన్నారు. దేశమంతటా పత్రికల్లో ఇదే ఇప్పుడు ప్రధాన వార్త. ఆయన ఆ హత్య చేశారో ..లేదో మనకి తెలీదు.
దేశంలోని చాలా... పత్రికలు, ఇప్పుడు... జయేంద్రని, ఆయనకంటే ముందు ఆ పదవిని అధిష్టించిన చంద్రశేఖర సరస్వతి స్వామితో పోల్చుతున్నాయి. జయేంద్ర కంటే చంద్రశేఖరసరస్వతి ఏవిధంగా మెరుగో విశ్లేషిస్తున్నాయి.
చంద్రశేఖర సరస్వతి ...కుల సమస్య, స్త్రీల సమస్య వంటి విషయాల్లో... కాస్త ఛాందసంగా ఉండేవారు కానీ... ఇలా హత్యలకు తెగబడలేదు.. అని కొందరు మెటికలు విరుస్తున్నారు...
హత్యని సమర్ధించాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ.... మిలియన్ల మంది ప్రజల మనసుల్ని విషపూరితం చేసి, వారికి కులం మీద, బాల్య వివాహాల మీద, స్త్రీల అణచివేత మీద మనసుకి హత్తుకునేలా బోధలు చేయడం కంటే, హత్య అనేది తక్కువ నేరమని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
చంద్రశేఖర సరస్వతి, మీడియా చేత, దేశంలోని ప్రముఖుల చేత సజీవదైవంగా, నడిచే దైవంగా...ఖ్యాతి అందుకున్నారు. అగ్రకుల మీడియాకి ఆయన కౄరత్వం అంత తేలిగ్గా అర్ధం కావడం కష్టం.
అర్ధం కావడం కష్టం.
1994లో అస్తమించేవరకూ చంద్ర శేఖర సరస్వతి - కులవ్యవస్థకి, హిందూ మతంలోని ఇతర దురాచారాలకు - కోట గోడ మాదిరిగా రక్షణగా నిలిచారు.
* భారతీయ విద్యా భవన్‌ వారు చంద్రశేఖర సరస్వతి ప్రవచనాలతో 'హిందూ ధర్మ, ది యూనివర్సల్‌ వే ఆఫ్‌ లైఫ్‌' అనే శీర్షికతో..., 800కి పైగా పుటలతో భారీగ్రంథాన్ని ప్రచురించారు. ఆ పుస్తకంలో పేర్కొన్న చంద్రశేఖర సరస్వతి అభిప్రాయాలు చూడండి:
కులమే బలం:
కులం మన బలహీనత కాదని, అదే మన బలమని స్వామి వాదిస్తారు. అంటారు. వేల సంవత్సరాల కాలంలో... ఎన్నో దాడుల్ని తట్టుకుని, ఇతర మతాల సవాళ్ళను తట్టుకుని హిందూ మతం ఇంకా జీవించి ఉన్నదంటే, అందుకు కారణం 'కులమే'నని. చంద్ర శేఖర సరస్వతి నమ్మకం. (చూడండి: హిందూ ధర్మ, పే.56,57)
వేదాలు పుట్టిన 'సప్త సింధు' ప్రాంతంలో...ఇవ్వాళ హిందూమతం తుడిచి పెట్టుకుపోయింది. గాంధార దేశం అని చెప్పబడే ఆఫ్ఘనిస్తాన్‌లో హిందువులు లేరు.
ఆది శంకరులు పీఠం నెలకొల్పిన కాశ్మీర్‌ సంగతేమిటి?
ఇవ్వాళ కాశ్మీర్‌ హిందువుల్లో కులాలు లేవు. ఉన్నది ఒకటే కులం. అదే బ్రాహ్మణ కులం. దీనర్ధం ఏమిటంటే, అక్కడ బ్రాహ్మణులు తప్ప మిగతా కులాల వారందరూ ...మతం మారి పోయారు. బ్రాహ్మణులు మిగిలిపోయారు.
అక్కడే సువిశాల దేశంలో ...అనేక ప్రాంతాల్లో, కింది కులాల వారు హిందూ మతాన్ని విడిచిపెట్టి, బౌద్ధాన్నో, ఇస్లాంనో, క్రైస్తవాన్నో ...ఎంచుకున్నారు. ఇవాళ దళితులు పెద్ద ఎత్తున హిందూ మతాన్ని ఖాళీ చేసి, క్రైస్తవంలోకి వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది.
ఇంత జరుగుతున్నా... ఇవాళ ఎవరైనా... ఇసుకలోకి తల దూర్చిన ఉష్ట్ర పక్షి మదిరిగా మాట్లాడుతూ.., కులవ్యవస్థ, హిందూ మతానికి మంచి ఉపకారం చేసిందని నిస్సిగ్గుగా... వాదిస్తుంటే ...ఏంచేయాలి?
8సం.కే ఆడపిల్లలకి పెళ్లి చేయాలి!
అవును. చంద్రశేఖర సరస్వతి వారి అభిప్రాయాలు ఇవే. ఆడపిల్లల్ని, చదివించడం, ఉద్యోగాలకి పంపండం తప్పని స్వామివారి అబిప్రాయం. వాళ్లు తప్పుదారి పడతారని ఆయన ఆందోళన. ఆడదానికి, భర్తే ఈశ్వరుడని, 8సం.లకే పెళ్లి చేస్తే ఆడపిల్ల ఇక ఈ ఈశ్వర ప్రాయుడైన భర్త వద్దే కాళ్లు కడుగుతూ ..పడి ఉంటుందని స్వామి విశ్వాసం. బాల్యవివాహాల వలన, ఆడపిల్లలు ముక్కుపచ్చలారని వయసులో వితంతువులుగా మారుతున్నా, నష్టమేమిటని స్వామి ప్రశ్నిస్తారు. వితంతు పునర్వివాహం ఊసుకూడ స్వామికి గిట్టదు. (చూడండి: 'హిందూధర్మ', పే.578 -597)
స్మృతులు మారవు
మనుస్మృతి తదితర స్మృతుల్లో శూద్రుల పట్ల, స్త్రీల పట్ల ఎంత అమానుషమైన వైఖరి వ్యక్తమైనా... ఆ స్మృతుల్ని అక్షరం కూడా మార్చడానికి వీల్లేదని స్వామి అభిప్రాయం. (అదే పుస్తకం: పే.498)
పుట్టుకతోనే ...కులాలు
భగవద్గీత వంటి గ్రంధాల్లో స్వయంగా శ్రీకృష్ణుడే - వర్ణవ్యవస్థకి గుణ, కర్మలే కారణమని చెప్పినా.. చంద్రశేఖర సరస్వతి స్వామి.. అంగీకరించేందుకు సిద్ధంగా లేరు.
సంస్కరణ వాదుల పైన అయన విరుచుకుపడతారు. పుట్టుకతోనే, కులం సంక్రమిస్తుందని, తాను నిరూపించగలనని స్వామి ఢంకా బజాయించి చెపుతారు. కొన్ని కులాలకు మాత్రమే వేదాధికారం ఉంటుందని, స్వామి చెపుతారు. ఒకరి చేతి వంట మరొకరు తినరాదని, వర్ణాంతర వివాహాలు చేసుకోరాదని చెపుతారు. కులనిర్మూలనకి కృషిచేసే కంటే, దేవాలయాలు పెంచేందుకు కృషి చేస్తే నయమని చెపుతారు. కాళ్లు నెప్పి పుట్టేదాకా, ఊరేగింపుల్లో తిరగడం, గొంతు నొప్పి పుట్టేదాకా అరవడం మానేసి, ఏదైనా పనికొచ్చే పని చేస్తే నయమని స్వామి, కులవ్యతిరేక ఉద్యమకారులకి చెపుతారు. (అదే పుస్తకం: 615- 621, 615 -675)

*. ఈ ముసలి గెడ్డం స్వామి ప్రబోధాల్ని విని, ఎన్ని మిలియన్లమంది, తమ ఆడ పిల్లల్ని చదువుకి, ఉద్యోగాలకి పంపించకుండా ఆపేశారో...., ఎన్ని బాల్య వివాహాలు జరిగాయో.., ఎందరు వితంతువుల జీవితాలు అమానుష ఆచారాలకు బలై పోయాయో..., ఎంతమంది కులవిషాన్ని తమ తలలనిండా తనివితీరా నింపుకుని, తమ జీవితాల్ని, తమకి తటస్థ పడిన వారి జీవితాల్ని నరకంగా మార్చారో.. తలుచుకుంటే, భయం వేప్తోంది! ఒక హత్యకంటే, ఇటువంటి ప్రబోధాలు ఎన్నో లక్షల రెట్లు దారుణమని మన మేధావులకి, మీడియాకి ఎప్పటికైనా... అర్ధమవుతుందా?

*.  అసలు పుట్టుకతోనే... హెచ్చుతగ్గుల కులాలు, సహజంగా వస్తాయని..., బాల్యవివాహాలు చేయాలని, స్త్రీలకి చదువు పనికి రాదని వాదించే, స్వామి మీద కేసుపెట్టి, జైల్లోకి నెట్టాల్సిన అవసరం లేదా? సమానత్వానికి, పౌరహక్కులకి, హామీ ఇచ్చే రాజ్యాంగం అమలులో ఉండగా ...ఈ ముసిలి గెడ్డం స్వామి... మూర్ఖమైన, అమానవీయమైన అభిప్రాయాల్ని, భారతీయ విద్యాభవన్‌ వారు పుస్తకాలు వేసి ఎలా ప్రచారం చేస్తారు? ఇటువంటి పుస్తకాల్ని నిషేధించాల్సిన అవసరం లేదా? ప్రచురణ కర్తల మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదా?
తి ఈ చంద్ర శేఖర స్వామి ...ఇంత దారుణంగా ఛాందస విషాన్ని చిమ్ముతుంటే, ఈయన్ని ఎదుర్కొన్న వారెవరూ లేరా? లేకేం ఉన్నారు. స్వామి దయానంద సరస్వతి శిష్యులు పండిత గోపదేవ్‌ - 60ల్లోనే 'శంకర పీఠాధిపతులు - అంటరాని వారు' అనే పుస్తకం రాసి, శంకర పీఠాధిపతి అధికారానికి, అహంకారానికి ప్రత్యక్షంగా సవాల్‌ విసిరారు. (ఇదే గోపదేవ్‌ 'అపశూద్రాధికరణము - శంకర భగవత్పాదులు' అన్న పుస్తకం రాసి, ఆది శంకరులనే ప్రతిభావంతంగా విమర్శించారు.)
*. 'శంకర పీఠాధిపతులు -అంటరాని వారు' గ్రంథం ముగింపులో గోపదేవ్‌ ఈ మాటలు రాశారు:
''....ఈ యంటరానితనమును పోకుండ కాపాడువారెవరు? దీనికి నా సమాధానము బ్రాహ్మణనామధారులు. వారిలో అందరు కాకపోయినను కొందరు పండితులు. శ్రోత్రియులమని చెప్పుకొనువారు ఈయంటరానితనమును శాశ్వతముగా హిందువులలో నాటుకొనియుండునట్లు యత్నించుచునే యున్నారు. ఇక వారి ఆచార్యుల సంగతి చెప్పనక్కరయే లేదు. ఆదిశంకరులు వేదమతము నుద్ధరించుటకు కాపాడుటకు నేర్పరచిన పీఠములు, పీఠాధిపతులు మాత్రము అంటరానితనమును కాపాడుచునే యున్నారు. పీఠాధిపతులు మాలమాదిగలను చూచుటయు దోషావహమందురు. మాలమాదిగలు స్వాములను దర్శింపనర్హులేకారు. ఎప్పుడైన మాలమాదిగలు ఆచార్యులదర్శనము చేసికొనుట సంభవించినపక్షమున ఆచార్యులు ప్రాయశ్చిత్తము చేసికొనువలసిన వారగుదురు. నూర్లకొలది స్నానములు చేసినకాని వారు శుద్ధులు కారు. ఇట్టి నియమాలు కామకోటి పీఠాధిపతులు మిక్కిలిగా పాటింతురనియు అందువలననే వారిలో నెక్కుడు మహత్తు కలదనియు నెందరో చెప్పగా వినుచున్నాము. దీనినిబట్టి చూచిన హిందువులలో అంటరానివారికీ పీఠాధిపతులు మిక్కిలి భయపడుదురని తోచెడివి....
....కామకోటి పీఠాధిపతులు చాల గొప్పవారట. వారు ఎన్నియో ఘన కార్యములను నిర్వహించుచున్నారట. వేదపరిషత్తులు, ఇంకను ఏవేవో పెట్టి వేలకు వేలు ధనము బ్రాహ్మణులకు వేదాధ్యయన సంపన్నులకు నిచ్చి వారి నుద్ధరించుచున్నారట. దానితోనే హిందువులెల్ల రుద్ధరింపబడుదురట. బ్రాహ్మణుల నుద్ధరించుటకు రాత్రింబవళ్ళు పాటుపడు పీఠాధిపతులు అంటరానివారి దుస్థితి నేల విచారింతురు? అంటరాని వారికి పీఠాధిపతులు దర్శనముకూడ నీయక స్వయముగా వారికి దూరులై అంటరానివారై తమ్ముతాము కాపాడు కొనుటలోనే తత్పరులై యుందురు. అంటరానివారు తమ్మును, తాము పూజించు దేవతలను చూచిన తాము తమ దేవతలు మైల బడుదుమని తలంతురు. కాని పీఠాధిపతులెంతో పవిత్రులై నందున వారిని జూచిన వారు పవిత్రులు కావలసియుండ, దానికి విపరీతముగా పవిత్రులే అపవిత్రుల దర్శనమున మైలబడుదురుట. వారి పవిత్రత యెంతదుర్బలమైనదో దీనినిబట్టి తెలియు చున్నది. వారి నేమనగలము? వారు చెప్పినది వేదము; వారాచరించినది ధర్మము.
బ్రాహ్మణులు బ్రాహ్మణ గురువులు నిట్టి యాచార ములను పాటించుచున్నంత వరకు నీ దేశమును హిందువులలో అంటరానితనము దూరము కాదు. హిందువులకు వారే నాయకులు, మార్గదర్శకులును. శ్రేష్ఠజన్ములు మిక్కిలి బుద్ధిమంతులు, విద్యావంతులు, కావున మిగిలిన హిందువులు వారినే అనుసరింతురు.
హిందువులలోని అంటరానితనము పోవలెననిన బ్రాహ్మణులమని చెప్పుకొనువారు కాక మిగిలిన హిందు వులెల్లరునేకము కావలయును. వారిలోగల హెచ్చుతగ్గు భావములను ముందు పోనాడవలెను. బ్రాహ్మణులను వారితో సహాయనిరాకరణము ప్రారంభింపవలయును. బ్రాహ్మణనామధారులకు సంఘములో ప్రస్తుతమున్న గౌరవ మర్యాదలనన్నింటిని త్రోసిపుచ్చవలెను. వారిని సభలలో గౌరవించుట మానవలెను. వారిని తాకిన ఇతరులు మైలబడి నట్లెంచి స్నానాదులనాచరింపవలెను. వారి పౌరోహిత్యము నంగీకరింపరాదు. వారి ఆశీర్వాదములనాశింపరాదు. వారు చూచుచుండగా తామేదియు తినరాదు. దృష్టి స్పర్శ దోషము లను కేవల బ్రాహ్మణ నామధారుల యెడ పాటింపనారం భింపవలెను. ఇట్లు చేయకున్న హిందువులలోనున్న అంటరానితనము రూపుమాయనేరదు. సంఘ శ్రేయస్సుకు, దేశశ్రేయస్సుకు వేరుపురువులుగ నున్న ఈ స్వార్ధపరులకు 'భవతీ భిక్షాం దేహి' అనుటయే శరణ్యమని ఋజువు చేయవలెను. దీనికిదియేమందు.''
రచన .రమణమూర్తి
(ఎడిటర్ విజయవిహారం)